telanganadwani.com

NITWarangal

ఎన్ఐటీ వ‌రంగ‌ల్ అధ్యాప‌కుల‌కు భార‌తీయ ప్ర‌మాణాల‌పై అవ‌గాహ‌న‌..

తెలంగాణ ధ్వని : వ‌రంగ‌ల్ ఎన్ఐటీ అధ్యాప‌కులకు భార‌తీయ ప్ర‌మాణాల బ్యూరో (బీఐఎస్‌) అధికారులు అవ‌గాహ‌న కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. విద్యార్థుల‌కు భార‌తీయ ప్ర‌మాణాల‌పై పూర్తి అవ‌గాహ‌న క‌ల్పించేందుకు, త‌ర‌గ‌తుల్లో ప్ర‌మాణాల‌ను భాగం చేసేందుకు ఇటీవ‌లె బీఐఎస్‌, ఎన్ఐటీ వ‌రంగ‌ల్‌తో అవ‌గాహ‌న ఒప్పందం చేసుకుంది.
ఈ ఒప్పందంలో భాగంగా.. బ్యూరో ఆఫ్ ఇండియ‌న్ స్టాండ‌ర్డ్స్ చేస్తున్న కార్య‌క్ర‌మాలు, ప్ర‌మాణాల రూప‌క‌ల్ప‌న‌, నాణ్య‌త ప‌రీక్షా విధానాలు, విద్యార్థుల‌కు బీఐఎస్ అందిస్తున్న ప్రోత్సాహ‌కాలు, ప‌రిశోధ‌క కార్య‌క్ర‌మాలు త‌దిత‌ర అంశాల‌పై అధ్యాప‌కుల‌కు అవ‌గాహ‌న కార్య‌క్ర‌మం నిర్వ‌హించింది.
సోమ‌వారం ఎన్ఐటీ వేధిక‌గా జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మాన్ని ఎన్ఐటీ వ‌రంగ‌ల్ డైరెక్ట‌ర్ విద్యాధ‌ర్ సుభూది, బీఐఎస్ సీనియ‌ర్ డైరెక్ట‌ర్ కేవీ రావు, డైరెక్ట‌ర్, హైద‌రాబాద్ శాఖాధిప‌తి పీవీ శ్రీకాంత్ లు ప్రారంభించారు. ఎన్ఐటీ బీఐఎస్ మెంటార్ ప్రొఫెస‌ర్ ర‌తీష్ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన‌ ఈ కార్య‌క్ర‌మంలో డైరెక్ట‌ర్ సుజాత, జాయింట్ డైరెక్ట‌ర్లు రాకేశ్ త‌న్నీరు, రాజేష్ చౌద‌రి, డిప్యూటీ డైరెక్ట‌ర్లు కెవిన్‌, అజిత్ పాల్గొన్నారు.
ఈ సంద‌ర్భంగా ఎన్ఐటీ వ‌రంగ‌ల్ డైరెక్ట‌ర్ ప్రొఫెసర్ బిద్యాధర్ సుబుధి మాట్లాడుతూ.. విద్యార్థుల‌కు త‌ర‌గ‌తి గ‌ది నుంచే భార‌తీయ ప్ర‌మాణాల గురించి తెల‌పాల్సిన అవ‌స‌రం ఉంద‌ని.. దేశీయ ప్రామ‌ణీక‌ర‌ణ‌లో బీఐఎస్ కీల‌క పాత్ర పోషిస్తోంద‌న్నారు.
బీఐఎస్ తో ప‌ర‌స్స‌ర ఒప్పందం భ‌విష్య‌త్తులో నూత‌న ఆవిష్క‌ర‌ణ‌ల‌కు శ్రీకారం చుడుతుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. ఎన్ఐటీలో బీఐఎస్ ఎక్స్‌లెన్స్ కేంద్రం ఏర్పాటు, ప్రామాణీక‌ర‌ణ‌, ప‌రిశోధ‌న‌ల్లో భాగ‌స్వామ్యం, స్టాండ‌ర్డ్స్ క్ల‌బ్స్ త‌దిత‌ర విష‌యాల్లో క‌లిసి ముందుకు సాగాల‌ని కోరారు.
బీఐఎస్ సీనియ‌ర్ డైరెక్ట‌ర్‌, నోడ‌ల్ అధికారి కేవీ రావు మాట్లాడుతూ.. ప్ర‌తీ ఒక్క‌రి జీవితంలో భార‌తీయ ప్ర‌మాణాలు భాగ‌మ‌ని, దేశాభివృద్ధిలో ప్ర‌మాణాలే కీల‌క పాత్ర పోషిస్తున్నాయ‌న్నారు. 78ఏళ్లుగా బీఐఎస్ ప్రామాణీక‌ర‌ణ‌లో ఉంద‌ని, వివిధ కార్య‌క్ర‌మాల ద్వారా దేశం న‌లుమూల‌లా ప్ర‌మాణాలు చేర‌వేర్చే ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌న్నారు.
విద్యార్థుల కోసం స్టాండ‌ర్డ్స్ క్ల‌బ్స్ ఏర్పాటు చేయ‌టంతో పాటు ఎన్ఐటీ లాంటి ప్ర‌తిష్టాత్మ‌క సంస్థ‌ల‌తో ఒప్పందాల‌తో ప్రమాణాల‌ను త‌ర‌గ‌తి గ‌దుల్లోకి తీసుకొస్తున్నామ‌ని చెప్పుకొచ్చారు. బీఐఎస్ హైద‌రాబాద్ శాఖాధిప‌తి పీవీ శ్రీకాంత్ రెండు సంస్థ‌ల మధ్య ఒప్పందంతో ఒన‌గూరే ప్ర‌యోజ‌నాల గురించి వివ‌రించారు.  అనంత‌రం బీఐఎస్ అధికారులు వివిధ అంశాల‌పై టెక్నిక‌ల్ ప్ర‌జంటేష‌న్లు అందించారు. ఈ కార్య‌క్ర‌మంలో అన్ని విభాగాల ప్రొఫెస‌ర్లు పాల్గొన్నారు.
రిపోర్టర్. ప్రతీప్ రడపాక

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top