తెలంగాణ ధ్వని : ఒకే ఒక్కడు.. 29 కేసుల్లో ప్రధాన నిందితుడు. మూడు మర్డర్లు, మరికొన్ని హత్యాయత్నాలు, ఇంకెన్నో దొంగతనాలు.. ఇలా చేసుకుంటూ పోవడమే ఓ వృత్తిగా ఎంచుకున్నాడు.
చిన్నప్పటి నుంచి నేరాలకు పాల్పడుతుండడంతో కుటుంబం కూడా దూరం చేసింది. జైలు జీవితం అనంతరం బస్టాండ్ ప్రాంతాల్లో ఉంటూ .. రాత్రి సమయంలో దొంగతనాలు, హత్యలకు పాల్పడుతుంటా డు.
ఈ ఘరానా దొంగ ఇటీవలే ఆల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వృద్ధ దంపతులు హత్యకు గురైన ఘటనలో పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లాడు.
ఆ వివరాలను బుధవారం పేట్ బషీరాబాద్లోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ కోటిరెడ్డి వివరాలు వెల్లడించాడు.
అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధి, సూర్యనగర్ ప్రాంతానికి చెందిన అల్లి కనకయ్య (70), అల్లి రాజమ్మ (65)లు ఓ రేకుల ఇంట్లో కిరాయికి ఉంటూ వాచ్మన్, కూలీ పను లు చేసుకుంటూ జీవిస్తున్నారు.
ఈ నెల 4న అర్ధరాత్రి వారు నిద్రిస్తున్న రేకుల ఇంట్లోకి అనిల్ చొరబడి వారిని కర్రతో కొట్టి చంపి.. వృద్ధురాలు మెడలోని బంగారు పుస్తెలు, వెండి పట్టా గొలుసులు, నగదుతో పాటు రెండు సెల్ ఫోన్లను దొంగిలించి పరారయ్యాడు.
మృతుల కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టి..అల్వాల్ మచ్చ బొల్లారం, కృష్ణా నగర్ కాలనీకి చెందిన చింతకింది అనిల్ (37)ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకున్నాడు.
నిందితుడిని అరెస్ట్ రిమాండ్కు తరలించారు. ఈ సమావేశంలో మేడ్చల్ జోన్ అడిషనల్ డీసీపీ పురుషోత్తం, పేట్ బషీరాబాద్ ఏసీపీ రాములు, అల్వాల్ సీఐ రాహుల్ దేవ్, డీఐ తిమ్మప్ప, సీసీఎస్ మేడ్చల్ సీఐ దాలినాయుడు, ఎస్ఓటీ సీఐ శ్యాంసుందర్ రెడ్డితో పాటు ఎస్ఐలు, సిబ్బంది ఉన్నారు.
నిందితుడి నేర చరిత్ర..
నిందితుడు చింతకింది అనిల్.. బొల్లారం ఏరియాలోనే ఉంటూ..2003 బాల్య వయస్సు నుంచి దొంగతనాలకు అలవాటు పడి జువైనల్ హోమ్కు కూడా వెళ్లి వచ్చాడు. ఇతనిపై దాదాపు 29 కేసుల వరకు ఉన్నాయి.
2013లో ఒక మహిళపై లైంగికదాడికి పాల్పడి.. హత్య చేసిన కేసులో అల్వాల్ పోలీస్ స్టేషన్ నుంచి చర్లపల్లి జైలుకు వెళ్లి వచ్చాడు. 2016లో బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక పదహారేళ్ల బాలికపై లైంగికదాడికి పాల్పడి జైలుకు వెళ్లాడు.
ఆ కేసులో అతనికి లైఫ్ పడగా.. 2025 ఏప్రిల్ 26న హైకోర్టు ఉత్తర్వుల మేరకు జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. ఈ నెల 4న సూర్యనగర్ కాలనీలో వృద్ధ దంపతులను హత్యచేసి తిరిగి జైలుకు వెళ్లాడు.
రిపోర్టర్. ప్రతీప్ రడపాక