తెలంగాణ ధ్వని : పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిచిన తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్ కుమార్)కి కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఇటీవల ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, ముఖ్యంగా ఓ సామాజిక వర్గాన్ని దూషించడం, బీసీ కుల గణనపై విమర్శలు చేయడంపై కాంగ్రెస్ అధిష్టానం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన ఆరోపణలు, పార్టీ లైన్కు వ్యతిరేకంగా ప్రవర్తించడం, బీసీ కుల గణన పత్రాలను దహనం చేయడం వంటి ఘటనలు పార్టీని అసహనానికి గురి చేశాయి.
క్రమశిక్షణా సంఘం నోటీసు
కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణా సంఘం మల్లన్నకు నోటీసులు జారీ చేస్తూ, ఫిబ్రవరి 12వ తేదీలోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. బీసీలకు సంబంధించి కుల గణనను ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని, దీనిపై ఇష్టారీతిన వ్యాఖ్యలు చేయడం తగదని నోటీసులో పేర్కొంది. ఎమ్మెల్సీగా కాంగ్రెస్ బీ ఫారం మీద గెలిచిన మల్లన్న, పార్టీకి విధేయంగా ఉండాలని నోటీసులో సూచించింది.
మల్లన్న చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే పార్టీ నేతల్లో తీవ్ర అసంతృప్తిని రేకెత్తించాయి. మంత్రులు, ఇతర కీలక నేతలు మల్లన్నపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీసీ నేతలు కూడా మల్లన్న వ్యవహారశైలిని ఖండిస్తూ కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదులు చేశారు. ఆయనపై పోలీసులకు ఫిర్యాదులు కూడా నమోదయ్యాయి.
మల్లన్న భవిష్యత్ రాజకీయ ప్రస్థానం
ఈ పరిణామాల నేపథ్యంలో తీన్మార్ మల్లన్న పార్టీని వీడే అవకాశముందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇప్పటికే ఆయన “నోటీసులు ఇవ్వడానికి వాళ్లు ఎవరు?” అంటూ ప్రశ్నించారు. ఇది మరింత ఉత్కంఠ రేపుతోంది.
ఒక్కవేళ మల్లన్న వివరణ ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీ ఆయనపై కఠిన చర్యలు తీసుకోవడం ఖాయం. అదే సమయంలో, ఆయన రాజీనామా చేసి కొత్త రాజకీయ మార్గాన్ని ఎంచుకునే అవకాశమూ కనిపిస్తోంది. ఈ వివాదం ఎలా మలుపుతిప్పుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.
రిపోర్టర్. ప్రతీప్ రడపాక