తెలంగాణ ధ్వని : ఖానాపూర్ మండలంలోని గూడూరు మండలం లక్ష్మీపురం గ్రామ సమీపంలోని పాకాల వాగు వద్ద మొసలి ప్రత్యక్షమై స్థానికులను భయాందోళనకు గురి చేసింది. ఎండల తీవ్రత కారణంగా చెరువులు, వాగులు నీరు కోల్పోతున్నాయి. నీటి కొరత కారణంగా అడవి ప్రాంతాల నుండి మొసళ్లు నివాస ప్రాంతాల వైపు రాబోతున్నాయి.
శుక్రవారం రాత్రి ఓ భారీ మొసలి రహదారి దాటుతుండగా ప్రయాణికులు గమనించి భయంతో పరుగులు తీశారు. ఈ ఘటనతో గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే కొందరు స్థానికులు మొసలిని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీడియో వైరల్ కావడంతో ఈ ఘటనపై ప్రజల్లో చర్చ మొదలైంది.స్థానికులు ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారులకు తెలియజేశారు. సంబంధిత అధికారులు మొసలిని పట్టుకుని సురక్షిత ప్రాంతానికి తరలించే చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. రాత్రి సమయంలో ఈ మార్గంలో ప్రయాణించే వారు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ అయ్యాయి.
ఇప్పటికే ఈ ప్రాంతంలో గతంలోనూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. మొసళ్లు నీటి కోసం బయటకు వస్తున్న నేపథ్యంలో సమీపంలోని చెరువులు, వాగుల వద్ద ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు
రిపోర్టర్. దీప్తి