- మొత్తం బడ్జెట్ – రూ.1,071.48 కోట్లు.
- సొంత ఆదాయం – రూ.337.38 కోట్లు.
- ప్రభుత్వ గ్రాంట్లు – రూ.728.10 కోట్లు.
- డిపాజిట్లు, అడ్వాన్సుల ద్వారా వచ్చే ఆదాయం – రూ.600 కోట్లు.
- విలీన గ్రామాల అభివృద్ధి.
- పెట్టుబడులకు అవకాశం . బల్దియా ఆదాయం పెంపు -కొత్త వ్యూహాలు .
తెలంగాణ ధ్వని : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC) 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను భారీ బడ్జెట్ను ప్రకటించింది. మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సమావేశంలో మొత్తం రూ.1,071.48 కోట్ల అంచనాలతో బడ్జెట్కు ఆమోదం లభించింది. ఇది గ్రేటర్ వరంగల్ చరిత్రలో మూడో అతిపెద్ద బడ్జెట్గా నిలిచింది. ఈ బడ్జెట్ రూపకల్పనలో ముఖ్యంగా నగర అభివృద్ధి, మౌలిక సదుపాయాల మెరుగుదల, పర్యావరణ పరిరక్షణ, ప్రజలకు అవసరమైన సేవల పెంపును ప్రాధాన్యతనిచ్చారు.
ఈ బడ్జెట్లో నగర అభివృద్ధికి సంబంధించి వివిధ రంగాలకు భారీగా నిధులు కేటాయించారు. ముఖ్యంగా ఉద్యోగుల జీతభత్యాలకు రూ.100 కోట్లు, శానిటేషన్ నిర్వహణకు రూ.29.92 కోట్లు, కరెంట్ బిల్లులకు రూ.34.30 కోట్లు, ఇంజినీరింగ్ విభాగానికి రూ.41.05 కోట్లు, సాధారణ నిర్వహణకు రూ.21.15 కోట్లు, టౌన్ ప్లానింగ్కు రూ.1.40 కోట్లు, విపత్తుల నిర్వహణ కోసం రూ.1.50 కోట్లు మంజూరు చేశారు.
గ్రేటర్ వరంగల్ పరిధిలో విలీనం అయిన గ్రామాల్లో అభివృద్ధి పనులకు ప్రత్యేకంగా రూ.24.77 కోట్లు కేటాయించారు. ఇందులో రహదారులు, తాగునీటి సరఫరా, మురుగునీటి పైప్లైన్ విస్తరణ, డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధికి నిధులు వినియోగించనున్నారు.
పర్యావరణ పరిరక్షణ & పార్కుల అభివృద్ధి
గ్రేటర్ పరిధిలో ఉన్న పార్కులు, ఓపెన్ జిమ్లు, వెండింగ్ జోన్లు, జంతువధశాలల కోసం రూ.10.40 కోట్లు కేటాయించారు. ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించేందుకు ఈ నిధులను వినియోగించనున్నారు.
నగర అభివృద్ధికి పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రస్తుత ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ముఖ్యంగా మెగా టెక్స్టైల్ పార్క్, మామునూర్ ఎయిర్పోర్ట్, అండర్గ్రౌండ్ డ్రైనేజీ, స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజీ, ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టులు వేగంగా ముందుకు సాగుతున్నాయి. ఈ ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత వరంగల్ నగరం దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా పెట్టుబడులను ఆకర్షించగలదని అధికారులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
ఈ బడ్జెట్ ద్వారా మున్సిపల్ కార్పొరేషన్ ఆదాయాన్ని పెంచేందుకు ప్రత్యేక వ్యూహాలను అమలు చేయనున్నారు. ముఖ్యంగా ఖాళీ స్థలాలకు పన్ను విధింపు, అక్రమ నిర్మాణాల నివారణ ద్వారా కార్పొరేషన్ ఆదాయాన్ని పెంచేందుకు చర్యలు చేపడతామని మేయర్ తెలిపారు.
గ్రేటర్ వరంగల్ అభివృద్ధికి ముఖ్యుల భరోసా
కౌన్సిల్ సమావేశంలో రాష్ట్ర దేవాదాయ, అటవీ శాఖల మంత్రి కొండా సురేఖ, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్. నాగరాజు, డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్, హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాఖడే పాల్గొన్నారు. వారు ఈ బడ్జెట్ ద్వారా వరంగల్ నగర అభివృద్ధికి మరింత దోహదం కలిగే అవకాశముందని అభిప్రాయపడ్డారు.
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటైనప్పటి నుంచి నాలుగు సార్లు రూ.1,000 కోట్లకు పైగా బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2017-18లో రూ.1,043 కోట్లు, 2018-19లో రూ.1,123.97 కోట్లు, 2019-20లో రూ.1,431 కోట్ల అంచనాలతో బడ్జెట్ను రూపొందించారు. అయితే, 2020-21లో అప్పటి కమిషనర్ పమేలా సత్పతి వాస్తవిక అంచనా వేసి కేవలం రూ.305 కోట్లతో బడ్జెట్ను రూపొందించారు. తర్వాతి సంవత్సరాల్లో రూ.570.75 కోట్లు (2021-22), రూ.609.47 కోట్లు (2022-23), రూ.612.29 కోట్లు (2023-24) ఉండగా, 2024-25లో మొదట రూ.650.10 కోట్లుగా అంచనా వేయగా, తర్వాత దాన్ని రూ.776.20 కోట్లకు పెంచారు. ఈసారి మరోసారి రూ.1,071.48 కోట్ల భారీ బడ్జెట్ను ప్రవేశపెట్టడం విశేషం.
రిపోర్టర్. ప్రతీప్ రడపాక