తెలంగాణ ధ్వని : వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చెన్నారావుపేట మండలంలో గురువారం ఉదయం జరిగిన ఈ ఘటనలో 50 మంది కూలీలతో వెళ్తున్న ట్రక్కు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో భానోతు భూక్య అనే కూలీ తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండగా, పలువురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను వెంటనే నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
చెన్నారావుపేట మండలం జీడిగడ్డ తండా వద్ద జరిగింది. కూలీలు నర్సంపేట మండలం ఇటుకలపల్లిలోని పొలాలకు మిర్చి కోత పనులకు వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. కూలీలంతా ట్రక్కులో ప్రయాణిస్తున్న సమయంలో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో ట్రక్కులో ఎక్కువ మంది ఉండడం వల్ల గాయాలు తీవ్రంగా సంభవించాయి.
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే చెన్నారావుపేట పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. గాయపడిన కూలీలను వెంటనే ఆసుపత్రికి తరలించి, ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, ట్రక్కు అధిక వేగంతో ఉండటం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. అయితే, డ్రైవర్ నిర్లక్ష్యమే దీనికి కారణమా? వాహనం లోడింగ్ ఎక్కువగా ఉండటమా? అన్న దానిపై విచారణ కొనసాగుతోంది.
రిపోర్టర్. దీప్తి