telanganadwani.com

జగదేక వీరుడు అతి లోక సుందరి 3D రూపంలో మళ్లీ సందడి చేయడానికి సిద్ధం..

తెలంగాణ ధ్వని : తెలుగు సినిమా చరిత్రలో ఓ స్వర్ణాక్షరాలతో లిఖించదగ్గ చిత్రం “జగదేక వీరుడు అతి లోక సుందరి (JVAS)”. ఈ ఫాంటసీ క్లాసిక్ చిత్రానికి ఈ ఏడాది మే 9న 35 ఏళ్ళ ఘనోత్సవం. ఈ సందర్భంగా ఈ సినిమాను 3D రూపంలో రీమాస్టర్ చేసి మళ్లీ థియేటర్లలోకి తీసుకురావడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి.

ఈ మహా ప్రాజెక్టుకు మళ్లీ ప్రాణం పోస్తున్నవారు అస్వినీ దత్. అయితే, ఈ ప్రయత్నాన్ని ముందుండి నడిపిస్తున్నది ఆయన అల్లుడు, ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ (కల్కి 2898 AD ఫేమ్). కొత్త తరం ప్రేక్షకులకు కూడా ఈ అద్భుతాన్ని పరిచయం చేయాలనే సంకల్పంతో ఈ పునర్ముద్రణ సాగుతోంది.

ఈ సందర్భంలో చిరంజీవి భావోద్వేగంతో స్పందించారు. “ఈ రోజు శ్రీదేవిని చాలా మిస్ అవుతున్నాను. ఆమె లేకుండా JVAS ఊహించలేం. ఇది మా ఇద్దరిదీ కలిసి చేసిన మొదటి చిత్రం. మా మధ్య ఉన్న కెమిస్ట్రీ ప్రేక్షకులను మాయచేసింది,” అని అన్నారు.

జగదేక వీరుడు చిత్రం 1990లో విడుదలై అప్పటి రూ.2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి, రూ.15 కోట్ల వరకు కలెక్షన్లు సాధించి సంచలనం సృష్టించింది. అప్పట్లో టిక్కెట్లు రూ.5కే అమ్ముతుండగా, బ్లాక్ మార్కెట్‌లో రూ.200 వరకు అమ్మారంటే సినిమాకున్న క్రేజ్ అర్థం చేసుకోవచ్చు.

ఈ చిత్రంలో చిరంజీవితో పాటు శ్రీదేవి, అమ్రీష్‌పూరి కీలక పాత్రల్లో నటించగా, సంగీతం ఇళయరాజా స్వరపరిచారు. దర్శకుడు కె. రాఘవేంద్రరావు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

ఈ సందర్భంగా చిరంజీవి మరో ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. JVAS సీక్వెల్‌పై ఇప్పటివరకు ఊహాగానాలే వినిపించాయి. కానీ ఇప్పుడు చిరంజీవి స్వయంగా ఒక ప్రతిపాదన చేశారు. “ప్రారంభంలో నేను సీక్వెల్‌కు వ్యతిరేకం.

కానీ ఇప్పుడు చూస్తే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రామ్ చరణ్, జాన్వి కపూర్ హీరోహీరోయిన్లుగా ఓ జాదూగారి కథను తెరపై చూడాలని ఉంది. ఇది వారి డ్రీమ్ ప్రాజెక్ట్ అవుతుంది,” అని పేర్కొన్నారు.

ఈ వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో హల్చల్ మొదలైంది. రామ్ చరణ్–జాన్వి కపూర్ కాంబినేషన్‌ను తెరపై చూడాలనే ఆసక్తి పెరిగింది. ట్రేడ్ వర్గాల్లో కూడా ఈ 3D రీ రిలీజ్ పై మంచి అంచనాలున్నాయి. చిరంజీవి ప్రత్యేక ప్రదర్శనలో హాజరవుతారని సమాచారం.

మళ్లీ 35 ఏళ్ల తర్వాత ‘అతి లోక సుందరి’ ప్రేక్షకులను మాయలోకి తేవడానికి సిద్ధంగా ఉంది. అప్పట్లో పాత తరం అభిమానులను అలరించిన ఈ చిత్రం, ఇప్పుడు కొత్త తరానికి కూడా ఫాంటసీ సినీ అనుభూతిని అందించబోతోంది.

రిపోర్టర్. ప్రతీప్ రడపాక 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top