- ప్రతి మహిళ పోషకాహారం తీసుకోవాలి
- అంగన్వాడి సేవలు సద్వినియోగం చేసుకోవాలి
- జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
తెలంగాణ ధ్వని : ప్రతి మహిళ తప్పనిసరిగా పోషకాహారం తీసుకోవాలని, మహిళ ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబమంతా ఆరోగ్యంగా ఉంటుందని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు.
చొప్పదండి మండల కేంద్రంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోషణ పక్షం ముగింపు ఉత్సవాలకు కలెక్టర్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పోషకాహారం పట్ల మహిళలకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని అన్నారు. ప్రతి మహిళ పోషకాహారం తీసుకుని ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, చిరుధాన్యాలతో వండిన ఆహారం తీసుకోవాలని తెలిపారు. ఆరోగ్య మహిళ కార్యక్రమం ద్వారా మహిళలందరికీ ఉచిత వైద్య పరీక్షలు చేయిస్తున్నామని, మహిళలందరూ ఆరు నెలలకు ఒకసారి ఉచిత పరీక్షలు చేయించుకోవాలని అన్నారు.

రానున్న విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు. ప్రైవేట్ పాఠశాలలకు చెల్లించే డబ్బును పొదుపు చేసి భవిష్యత్తులో పిల్లల ఉన్నత చదువులకు వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం అంగన్వాడి పిల్లలకు ప్రీస్కూల్ సర్టిఫికెట్లు అందజేశారు. పోషకాహార మేళాను పరిశీలించారు.
గర్భిణీలకు సీమంతాలు చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి ఎం.సరస్వతి, సిడిపిఓ నర్సింగారాణి, ప్రత్యేక అధికారి తిరుపతిరావు, డిసిపిఓ పర్వీన్, తహసిల్దార్ నవీన్ కుమార్, మెడికల్ ఆఫీసర్ శ్రీ కీర్తన, సూపర్వైజర్ శశి కుమారి పాల్గొన్నారు.
రిపోర్టర్. ప్రతీప్ రడపాక