- తెలంగాణలో బీసీ కులగణన వివాదం తీన్మార్ మల్లన్న సస్పెన్షన్, రాజకీయ ప్రకంపనలు
- తీన్మార్ మల్లన్న సస్పెన్షన్ – వివాదానికి కేంద్ర బిందువు
- బీసీల హక్కుల కోసం ఎంత దూరమైనా వెళ్తా” – మల్లన్న ఆగ్రహం
- తెలంగాణలో బీసీ ఉద్యమం – కొత్త మలుపు
- రాహుల్ గాంధీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లనున్నా – మల్లన్న
తెలంగాణ ధ్వని : తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన బీసీ కులగణన పెద్ద వివాదానికి కారణమైంది. రాష్ట్రంలోని బీసీ జనాభా శాతాన్ని తక్కువగా చూపించారని, కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన తప్పుల తడకగా మారిందని తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఈ వివాదంపై తీవ్రస్థాయిలో స్పందించి, ప్రభుత్వ సర్వే ప్రతులను నిరసనగా కాల్చివేయడం రాజకీయంగా సంచలనమైంది. ఆయన తీరు కాంగ్రెస్ వర్గాల్లో కలకలం రేపగా, పార్టీ హైకమాండ్ దీనిపై దూకుడు ప్రదర్శించింది.
తీన్మార్ మల్లన్న బీసీ కులగణనను తప్పుబడుతూ, దీన్ని దిద్దుకోకపోతే మరిన్ని అవాంతరాలు ఎదురవుతాయని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీ అతనికి షోకాజ్ నోటీసు ఇచ్చినా, మల్లన్న తన విధానాన్ని మార్చుకోకుండా మరింత కఠినంగా స్పందించడంతో, ఏఐసీసీ (అఖిల భారత కాంగ్రెస్ కమిటీ) అతనిని సస్పెండ్ చేసింది. అయితే, తన సస్పెన్షన్ వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారని మల్లన్న ఆరోపించారు. తాను గత కొద్దిరోజులుగా కాంగ్రెస్లో బీసీల హక్కుల కోసం పోరాడుతున్నానని, కానీ సీఎం తనను తప్పించేందుకు ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు.
తనపై తీసుకున్న చర్యలు కాంగ్రెస్లో అగ్రవర్ణ నేతలకు మాత్రమే రక్షణ ఉందని, బీసీలకు మాత్రం అన్యాయం జరుగుతోందని మల్లన్న ఆరోపించారు. “బీసీల హక్కుల కోసం ఎంత దూరమైనా వెళ్తా, తప్పుడు గణనను మళ్లీ మళ్లీ తగలబెడతా” అంటూ ఆయన తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. కేవలం బీసీలను లక్ష్యంగా చేసుకునే చర్యలు కాంగ్రెస్ చేస్తున్నందుకు నిరసనగా బీసీ వర్గాలు కూడా మల్లన్నకు మద్దతుగా నిలుస్తున్నాయి.
తీన్మార్ మల్లన్న సస్పెన్షన్తో బీసీ వర్గాల్లో ఉన్న ఆగ్రహం మరింత కఠినంగా మారిన సూచనలు కనిపిస్తున్నాయి. మహబూబ్నగర్లో కాంగ్రెస్ తన అభ్యర్థిని గెలిపించుకోలేకపోవడాన్ని ప్రస్తావిస్తూ, బీసీల రాజకీయ శక్తిని అంచనా వేయలేకపోతే పార్టీ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని మల్లన్న హెచ్చరించారు. “ఈ రోజు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలతో బీసీల బలం ఏంటో స్పష్టమవుతుంది. బీసీలు శక్తివంచన లేకుండా కాంగ్రెస్ను గెలిపించగా, ఇప్పుడు అదే పార్టీ మమ్మల్ని అణగదొక్కడానికి చూస్తోంది” అని ఆయన ఆరోపించారు.
తాను కాంగ్రెస్ను వీడే ప్రసక్తే లేదని, రాహుల్ గాంధీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి ఎంత దూరమైనా వెళతానని తీన్మార్ మల్లన్న స్పష్టం చేశారు. బీసీల రాజకీయ హక్కుల కోసం కట్టుబడి ఉంటానని, తనపై ఎన్ని చర్యలు తీసుకున్నా వెనుకడుగు వేయనని ప్రకటించారు. కాంగ్రెస్లో బీసీలకు సరైన ప్రాధాన్యత ఇవ్వకపోతే, భవిష్యత్తులో పార్టీ తీవ్ర పరిణామాలను ఎదుర్కొనే అవకాశముందని హెచ్చరించారు.
రిపోర్టర్. ప్రతీప్ రడపాక