తెలంగాణ ధ్వని : తెలంగాణ ప్రభుత్వం బెట్టింగ్ యాప్స్పై కఠినంగా వ్యవహరిస్తూ, వాటి అక్రమ కార్యకలాపాలను అరికట్టేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది. ఐజీ రమేష్ చీఫ్గా నియమితులయ్యారు. సిట్లో సీనియర్ పోలీస్ అధికారి రమేష్ రెడ్డి, ఎస్పీలు సింధు శర్మ, వెంకట లక్ష్మి, అడిషనల్ ఎస్పీ చంద్రకాంత్, డీఎస్పీ శంకర్ సభ్యులుగా ఉన్నారు. 90 రోజుల్లో నివేదిక సమర్పించాలని డీజీపీ జితేందర్ ఆదేశించారు. ఇప్పటికే పంజాగుట్ట, సైబరాబాద్, మియాపూర్ పోలీస్ స్టేషన్లలో 25 మంది సెలబ్రిటీలపై కేసులు నమోదయ్యాయి. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లకు కూడా నోటీసులు జారీ చేశారు. యాంకర్లు విష్ణుప్రియ, శ్యామల సహా పలువురు విచారణకు హాజరై ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.
ఈ వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా రంగంలోకి దిగింది. మనీ లాండరింగ్, హవాలా మార్గాల్లో లావాదేవీలు జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే 108 అక్రమ బెట్టింగ్ వెబ్సైట్లు బ్లాక్ చేయబడ్డాయి. మరో 133 బెట్టింగ్ ప్లాట్ఫాంలకు నోటీసులు జారీ చేశారు. బెట్టింగ్ యాప్స్కు సంబంధించి ఫైనాన్షియల్ లావాదేవీలను పర్యవేక్షించేందుకు సిట్, ఆర్బీఐకు సూచనలు చేయనుంది.
తెలంగాణలో అక్రమ బెట్టింగ్ కారణంగా గత కొంత కాలంగా అనేక మంది యువత జీవనోపాధిని కోల్పోయారు. కేవలం ఒకే సంవత్సరంలో 15 మంది ఆత్మహత్యలు చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ తరహా యాప్స్ వల్ల అమాయక ప్రజలు మోసపోతున్నారని, వీటిని పూర్తిగా అరికట్టాల్సిన అవసరం ఉందని అధికారులు భావిస్తున్నారు. ప్రజలను జాగృతం చేసేందుకు పోలీసులు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం బెట్టింగ్ యాప్స్ పై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. సిట్ ఆధ్వర్యంలో ఈ కేసుల దర్యాప్తును వేగవంతం చేస్తోంది. బెట్టింగ్ యాప్ ప్రమోషన్లకు సంబంధించిన వివరాలను పోలీసులు సేకరించేందుకు ప్రత్యేక టీములు ఏర్పాటు చేశారు. ప్రజలు ఇలాంటి యాప్స్కు దూరంగా ఉండాలని, ఇలాంటి అక్రమ కార్యకలాపాల్లో పాల్గొంటే కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
రిపోర్టర్. ప్రతీప్ రడపాక