telanganadwani.com

దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టు అత్యంత ప్రాధాన్యత కలది

తెలంగాణ ధ్వని: దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టు అత్యంత ప్రాధాన్యత కలది అని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు.

దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టు పరిధిలోని చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందేలా తగిన చర్యలు తీసుకోవాలని స్టేషన్ ఘనపూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) రోహిత్ సింగ్, స్టేషన్ ఘనపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్య, జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ మారుజోడు రాంబాబు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అశోక్ లతో కలిసి స్టేషన్ ఘనపూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి దేవాదుల ఎత్తిపోతల పథకం కింద భూసేకరణ ప్రక్రియ,పెండింగ్ పనుల పురోగతి, సాగు నీటి సరఫరాపై నీటి పారుదల శాఖ అధికారులతో క్షుణ్ణంగా చర్చించి, సమీక్షించారు. ఈ సందర్భంగా స్టేషన్ ఘనపూర్ శాసనసభ్యులు మాట్లాడుతూ.. దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టు అత్యంత ప్రాధాన్యత కలిగినదని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారానే స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని ఏడు మండలాలకు సాగుకు నీరు అందుతోందని, యుద్ధ ప్రాతిపదికన దేవాదుల ప్రాజెక్టు పెండింగ్ పనులను పూర్తి చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన అని తెలిపారు. ప్రతి నెల సమీక్షిస్తూ పనులు త్వరితగతిన పూర్తయ్యేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. ఎక్కడైనా సమస్యలు ఉంటే వెంటనే గుర్తించి వాటిని పరిష్కరించాలన్నారు. మల్లన్న గండి లిఫ్ట్ -1, లిఫ్ట్-2 పనులను జులై లోగా పూర్తిచేసి, సాగు నీరు అందించాలన్నారు.

 

డిసెంబర్ లోపు అశ్వరావుపల్లి ప్రధాన కుడి కాలువ పనులు పూర్తి కావాలన్నారు. ఆర్ఎస్ ఘనపూర్ నుంచి నవాబ్ పేట ప్రధాన కాలువ సీసీ లైనింగ్ పనులు వెంటనే ప్రారంభించాలన్నారు. అన్ని డిస్ట్రిబ్యూటరీస్ లలో, మైనర్ కెనాల్స్ లలో గుర్రపు డెక్క, చెత్త చెదారాలను తొలగించాలని సూచించారు. కెనల్ లను బలపర్చాలని, రెగ్యులేటర్స్, షెటర్స్ ఏర్పాటు చేయాలన్నారు. ఒకప్పుడు ఈ ప్రాంతం తీవ్రమైన కరువు ప్రాంతమని, దేవాదుల ప్రాజెక్టు చేపట్టిన తర్వాతనే సాగుకు, తాగు నీటికి ఇబ్బందులు లేవని వెల్లడించారు. దేవాదులకు సంబంధించి పెండింగ్ లో ఉన్న భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.

 

అనంతరం జిల్లా కలెక్టర్ రిజ్వన్ బాషా షేక్ మాట్లాడుతూ.. అధికారులందరూ సమన్వయంతో పెండింగ్ పనులన్నీ వేగంగా పూర్తిచేయాలని ఆదేశించారు. నీటి నిర్వహణకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో ఎస్డీసీలు సుహాసిని, హనుమాన్ నాయక్, ఆర్డీఓలు గోపీరాం, వెంకన్న, నీటి పారుదల శాఖ ఎస్ఈలు, ఈఈలు, డీఈలు, స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ఏజెన్సీ సభ్యులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్: కిరణ్ సంగ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top