నాగర్ కర్నూల్లో గ్యాంగ్ రేప్ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం
తెలంగాణ ధ్వని : నాగర్ కర్నూల్ జిల్లా ఊరుకొండలో శనివారం రాత్రి జరిగిన గ్యాంగ్ రేప్ ఘటనలో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. వేడుకల కోసం తన స్నేహితుడితో కలిసి వెళ్లిన మహిళను కామాంధులు దారుణంగా హింసించి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహావేశాలను రేపుతోంది.
స్నేహితుడితో ఉండగా దాడి
ఊరుకొండలో వేడుకల నుంచి తిరిగే మార్గంలో చెట్టు చాటున తన స్నేహితుడితో ఉన్న మహిళను ఆలయంలో పనిచేసే యువకుడు గమనించాడు. వెంటనే తన మిత్రులకు సమాచారం అందించగా, మద్యం మత్తులో ఉన్న ఎనిమిది మంది యువకులు అక్కడకు చేరుకున్నారు. యువకుడిపై దాడి చేసి, అతన్ని చెట్టుకు కట్టేసి మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
అత్యాచారానికి మరింత క్రూరత్వం
దాడిలో పాల్గొన్న దుర్మార్గులు మద్యం తాగుతూ తెల్లవారుజామున నాలుగు గంటల వరకు మహిళపై లైంగిక దాడి చేశారు. హింసకు గురైన బాధితురాలు దాహంతో నీళ్లు అడిగినప్పటికీ, నిందితులు కనికరం లేకుండా ఆమె నోట్లో మూత్రం పోసి క్రూరంగా వ్యవహరించారు. అనంతరం నిందితులు అక్కడి నుంచి తప్పించుకోగా, బాధితురాలు తన స్నేహితుడిని విడిపించుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
సీసీ కెమెరా ఫుటేజ్తో నిందితుల గుర్తింపు
బాధితురాలి ఫిర్యాదు మేరకు ఊరుకొండ పోలీసులు కేసును దర్యాప్తు చేయడం ప్రారంభించారు. సీసీ కెమెరా ఫుటేజీలను విశ్లేషించిన పోలీసులు ఆలయంలో పనిచేసే ఒక యువకుడిని అనుమానితంగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతడు మొత్తం ఘటన వివరాలను బయటపెట్టాడు. దీంతో మరో ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, మరొకరు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.
రిపోర్టర్ . ప్రతీప్ రడపాక