telanganadwani.com

TelanganaPolitics

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్: ‘‘బీఆర్ఎస్‌ను ఓడించడమే నా లక్ష్యం.

తెలంగాణ ధ్వని : బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తన గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న వివాదాస్పద ప్రచారంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనను తిరిగి పార్టీలోకి ఆహ్వానించారని వస్తున్న వార్తలను పూర్తిగా నిరాధారమైనవిగా ఖండించారు. ‘‘నేనంటే గిట్టని వారు, సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేసే కొన్ని గ్రూపులు కావాలని ఇలాంటి వదంతులు వ్యాపింపజేస్తున్నారు. ఇందులో ఎలాంటి నిజం లేదు,’’ అని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.

తాను బీజేపీలో చేరినప్పటి నుంచి బీఆర్ఎస్, కేసీఆర్ పై తన అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియజేస్తూనే ఉన్నానని, అలాంటప్పుడు ఈ తరహా ప్రచారాలు చేయడం దుష్ప్రచారమేనని వ్యాఖ్యానించారు. ‘‘ఇది పూర్తిగా బాధ్యతలేని వ్యక్తుల పని. నాపై ఇలాంటి తప్పుడు ప్రచారం చేసే వారిపై త్వరలోనే చట్టపరమైన చర్యలు తీసుకుంటాను’’ అని హెచ్చరించారు.

కేసీఆర్ పిలిస్తే వెళ్తారా? – ఈటల ఘాటైన సమాధానం

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈటల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘కేసీఆర్ మళ్లీ పిలిస్తే వెళ్తారా?’’ అనే ప్రశ్నకు ఆయన ధీటుగా స్పందించారు. ‘‘ఇదేమైనా పిల్లల ఆటనా? మేమంతా బాధ్యతగల రాజకీయ నాయకులం. వాళ్ల పార్టీ వాళ్లది, మా పార్టీ మాది. రేపు తెలంగాణలో బీజేపీని గెలిపించడం నా లక్ష్యం’’ అని ఆయన స్పష్టం చేశారు.

గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రోజులో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేపై తీవ్ర విమర్శలు చేశారు. ‘‘ఆ సర్వేలో సరైన సమాచారం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన కూడా శాస్త్రీయత లేనిది’’ అని ఆరోపించారు. ప్రజలను తప్పుదోవ పట్టించడానికే ఈ సర్వేలు నిర్వహిస్తున్నారని విమర్శించారు.

కులగణనపై ఈటల రాజేందర్ విమర్శలు

ఈటల రాజేందర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా తీవ్రంగా విమర్శించారు. ‘‘కులగణన చేపట్టాలంటే ముందు ఒక కమిషన్ ఏర్పాటు చేయాలి. దానికి చట్టబద్ధత కల్పించాలి. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న కులాలను గుర్తించాకే జనగణన చేయాలి. ఇలాంటివేం చేయకుండా కాంగ్రెస్ ప్రజలను మభ్యపెడుతోంది’’ అని ఈటల అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేదని, అవగాహన లేని వారు కులగణన పేరిట ప్రజలను దారి తప్పిస్తున్నారని ఆరోపించారు.

విద్యార్థి దశ నుంచే ఉద్యమం – ప్రజా సంక్షేమమే లక్ష్యం

తాను విద్యార్థిగా ఉన్నప్పుడు విద్యార్థి సంఘాల్లో చురుకుగా పనిచేశానని, సోషల్ వెల్ఫేర్ హాస్టల్‌లో చదువుకున్నానని ఈటల రాజేందర్ తెలిపారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం అనేక ఉద్యమాల్లో పాల్గొన్నానని చెప్పారు. ‘‘విద్యార్థి సంఘాలతో కలిసి అనేక సమస్యలపై పోరాడా. విద్యార్థుల హక్కుల కోసం ఎప్పుడూ నిలబడతా’’ అని అన్నారు.

బీజేపీ తరఫున బీఆర్ఎస్‌కు గట్టి పోటీ

ఈటల తన రాజకీయ ప్రస్థానంలో నిబద్ధతతో ముందుకు సాగుతున్నట్లు తెలియజేశారు. ‘‘తెలంగాణలో బీజేపీని బలపడేలా చేసి, బీఆర్ఎస్‌ను ఓడించడం నా లక్ష్యం. బీజేపీ తరఫున గట్టి పోటీ ఇచ్చి అధికారంలోకి రావడానికి పాటుపడతా’’ అని స్పష్టం చేశారు.

ఈటల రాజేందర్ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఆయనపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించడం, భవిష్యత్తులో చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

రిపోర్టర్. ప్రతీప్ రడపాక 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top