తెలంగాణ ధ్వని : బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42 శాతం మాత్రమే రిజర్వేషన్లు కల్పించడాన్ని తీవ్రంగా విమర్శించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, జనాభా వాటా ప్రకారం రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేశారు. శనివారం ఖమ్మం జిల్లాలో పర్యటించిన ఆమె, మీడియాతో మాట్లాడారు.
రిజర్వేషన్లపై ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించిన కవిత
“ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారం రాష్ట్రంలో బీసీ జనాభా 46 శాతంగా ఉంది. రీసర్వే చేస్తే ఇది 48 శాతానికి చేరుకుంటుంది. అలాంటప్పుడు 42 శాతం రిజర్వేషన్లు మాత్రమే ఎందుకు?” అని ఆమె ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చినా, అన్ని రంగాలకు కలిపి ఒకే బిల్లు పెడితే న్యాయపరమైన చిక్కులు వస్తాయని ఆమె అభిప్రాయపడ్డారు.
వేర్వేరు బిల్లుల అవసరం
ఒక్క అంశంపై కోర్టుకు వెళ్తే మొత్తం బిల్లు అమలులోకి రాకుండా పోతుందని సూచించిన కవిత, విద్య, ఉద్యోగాలు, రాజకీయ రంగాలకు వేర్వేరు బిల్లులు ప్రవేశపెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. ముస్లింలు, బీసీలకు కలిపి మొత్తం 56 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.
బీజేపీపై విమర్శలు
బీసీ రిజర్వేషన్ల విషయంలో బీజేపీ హిందూ–ముస్లింల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తోందని కవిత ఆరోపించారు. ముస్లింల జనాభా ఎంత ఉందో ప్రభుత్వమే నిర్ధారించి, దానికి తగిన రిజర్వేషన్లు ఇవ్వాలని ఆమె సూచించారు.
డెడికేటెడ్ కమిషన్ నివేదిక విడుదల చేయాలి
ప్రభుత్వం ఇప్పటివరకు డెడికేటెడ్ కమిషన్ నివేదికను బయటపెట్టలేదని విమర్శించిన ఆమె, అన్ని కులాల వారీగా జనాభా లెక్కలను ప్రభుత్వమే బహిరంగంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో బీసీలకు ప్రయోజనం
బీసీ వర్గాల అభివృద్ధికి బీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉందని, అందుకే పార్టీ పదవుల్లో 51 శాతం అవకాశాలు బీసీలకు కల్పించామని గుర్తుచేశారు. 2014లో సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా నిధులను ఖర్చు చేశామని తెలిపారు.
‘తెలంగాణ జాగృతి’ పోరాటం
బీసీల హక్కుల కోసం ‘తెలంగాణ జాగృతి’ పోరాడుతుందని, ఈ పోరాట ఫలితంగానే అసెంబ్లీలో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు, బతుకమ్మ పండుగకు రాష్ట్ర హోదా లభించాయని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.
రిపోర్టర్. ప్రతీప్ రడపాక