తెలంగాణ ధ్వని : మహబూబాబాద్ జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నర్సింహులపేట మండలం పెద్దనాగారం స్టేజి సమీపంలో మిర్చి తోటకు పనికి వెళ్తున్న మహిళా కూలీలతో ఉన్న ఆటోను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మహిళల పరిస్థితి విషమంగా ఉండగా, మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు ఘటన స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కూలీలు చర్లపాలెం గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు.
ప్రాధమిక సమాచారం మేరకు, లారీ అతివేగం కారణంగా ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. అయితే, పోలీసుల ఆధ్వర్యంలో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.
రిపోర్టర్. దీప్తి