telanganadwani.com

LokSabha

లోక్‌సభలో త్రిభువన్ సహకార విశ్వవిద్యాలయ బిల్లుపై చర్చ – వరంగల్ ఎంపీ కడియం కావ్య కీలక సూచనలు

తెలంగాణ ధ్వని : సహకార రంగంలో సమగ్ర అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని విశ్వవిద్యాలయ స్థాయి సంస్థలను నెలకొల్పడం ఒక ముందుగామి చర్యగా అభివర్ణించవచ్చని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య అన్నారు. బుధవారం లోక్‌సభలో త్రిభువన్ సహకార విశ్వవిద్యాలయ బిల్లుపై మాట్లాడిన ఆమె, సహకార రంగాన్ని బలోపేతం చేయడంలో ఈ బిల్లు కీలక పాత్ర పోషించనున్నప్పటికీ, ఇందులో అనేక అనిశ్చితితలు కూడా ఉన్నాయని అభిప్రాయపడ్డారు.

ఆమె పేర్కొన్న విధంగా, సహకార రంగంలో వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించేందుకు దేశవ్యాప్తంగా శాటిలైట్ క్యాంపస్‌లను ప్రోత్సహించడం అవసరమని సూచించారు. ఈ నేపథ్యంలో, ఈ బిల్లు సహకార సంస్థలు, రైతులు, గ్రామీణ కార్మికుల అభివృద్ధికి ఎలా తోడ్పడుతుందనే అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉందని చెప్పారు. గుజరాత్‌లోని ఆనంద్‌లో ఈ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడం శిక్షణ, పరిశోధన పరంగా సహకార రంగానికి ఊతమివ్వగలదని ఆమె గుర్తుచేశారు. అయితే, దీని ప్రయోజనాలు తెలంగాణ సహా ఇతర రాష్ట్రాల్లోని రైతులకు, సహకార కార్మికులకు అందుబాటులో ఉంటాయా? అనే ప్రశ్నను ఆమె లేవనెత్తారు.

అంతేకాక, ఇర్మాను విశ్వవిద్యాలయంగా మార్చడం సానుకూలమైన చర్య అని పేర్కొన్న ఆమె, గ్రామీణ భారత అవసరాలకు ఇది ఎలా సరిపోతుందనే అంశంపై ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ సహా ఇతర రాష్ట్రాల్లో శాటిలైట్ క్యాంపస్‌లు, మొబైల్ శిక్షణ యూనిట్లు ఏర్పాటు చేయాలని ఆమె ప్రతిపాదించారు. సహకార రంగ అభివృద్ధికి స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక అవసరమని, ఈ బిల్లులో 5 ఏళ్ల కార్యాచరణ ప్రణాళిక, 50% గ్రామీణ కార్మికులకు శిక్షణ, 10 ప్రాంతీయ కేంద్రాల ఏర్పాటు వంటి లక్ష్యాలను చేర్చాలని కోరారు.

అదనంగా, సహకార సంస్థల పనితీరులో పారదర్శకత, సమ్మిళిత అభివృద్ధి, సహకార సేవల లభ్యత వంటి అంశాలపై స్పష్టమైన మార్గదర్శకాలు అవసరమని ఆమె సూచించారు. ఈ బిల్లు గ్రామీణ రైతులు, సహకార సంఘాలు, చిన్నతరహా వ్యవసాయ కార్మికుల అభివృద్ధికి మేలు చేయాలన్న ఉద్దేశంతో రూపుదిద్దుకుంటున్నా, ఆ లక్ష్యాలు అందుబాటులోకి వచ్చేలా స్పష్టమైన విధానాలను రూపొందించాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. సహకార వ్యవస్థ బలోపేతానికి, గ్రామీణ అభివృద్ధికి సహాయపడే విధంగా ఈ బిల్లును సమర్థవంతంగా రూపొందించాలని సభను కోరారు.

తెలంగాణ రాష్ట్రం, ముఖ్యంగా వరంగల్ రైతులు, గ్రామీణ కార్మికులు సహకార రంగంలో మెరుగైన అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారని, ఈ బిల్లులో తెలంగాణకు అనుగుణమైన మార్పులు రావాల్సిన అవసరం ఉందని ఆమె స్పష్టం చేశారు. సహకార రంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మరింత సహాయపడాలని ఆమె డిమాండ్ చేశారు.

రిపోర్టర్. ప్రతీప్ రడపాక 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top