తెలంగాణ ధ్వని న్యూస్ : వరంగల్ పట్టణంలోని అదాలత్ జంక్షన్ సమీపంలో జనవరి 22న జరిగిన ఘోర ఘటన అందరినీ కలవరపరిచింది. పట్టపగలే చుట్టూ జనాలు ఉన్నప్పటికీ, ఒక వ్యక్తి మరోవ్యక్తిపై కత్తితో దాడి చేసినప్పుడు ఎవ్వరూ ఆపేందుకు ముందుకు రాలేదు. కొందరు సెల్ఫోన్లలో వీడియోలు తీయడమే నిమగ్నమయ్యారు. ఈ ఘటన సమాజంలో క్షీణిస్తున్న సున్నితత్వం, భద్రతా భావాన్ని మానసిక నిపుణులు ఆందోళనగా వ్యక్తం చేశారు.
ఎంత దారుణం జరిగిందంటే…
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం, వరంగల్ మడికొండ ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్లు మాచర్ల రాజ్కుమార్ (38), ఏనుగు వెంకటేశ్వర్లు ఇద్దరు కూడా ఒకే ప్రాంతానికి చెందిన వితంతువుతో వివాహేతర సంబంధం కలిగి ఉండటంతో వారి మధ్య తరచూ ఘర్షణలు జరుగుతూ వచ్చాయి.
వెంకటేశ్వర్లు గత వారం కత్తి కొని తన ఆటోలో దాచిపెట్టాడు దాడి చేసేందుకు సరైన సమయాన్ని ఎదురు చూసి, అదాలత్ జంక్షన్ వద్ద మాచర్ల రాజ్కుమార్పై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో రాజ్కుమార్కు తీవ్ర గాయాలు కావడంతో, పోలీసులు అతడిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆసుపత్రికి చేరుకునేలోపే అతను మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.
నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఘటన జరిగి కొద్దిసేపటికే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్యకు గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది. సదరు ఘటనపై బీఎన్ఎస్ 103 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు సుబేదారి పోలీసులు తెలిపారు.ఈ ఘటనలో ప్రధానంగా ప్రజల స్పందనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. “హత్య జరుగుతుంటే నిర్లక్ష్య ధోరణితో చూసి వీడియోలు తీయడం సమాజంలో క్షీణిస్తున్న నైతిక విలువలకు సంకేతం” అని మానసిక నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రజలు నేరాలను అడ్డుకోవడంలో భాగస్వామ్యం కావాలని సుబేదారి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ రెడ్డి సూచించారు.
మనం చేసే ప్రయత్నమే మార్పు తీసుకువస్తుంది
ఈ ఘటన మనందరికీ ఆలోచన కలిగించాల్సిన సందర్భం. చట్టబద్ధ మార్గంలో న్యాయం కోసం ముందుకు రావాల్సిన బాధ్యత అందరిదీ కావాలి.
రిపోర్టర్.కళ్యాణి