తెలంగాణ ధ్వని : వరంగల్ జిల్లాలో మూడు వేర్వేరు సంఘటనల్లో చైన్ స్నాచింగ్, డబ్బు చోరీలకు పాల్పడిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుల దర్యాప్తులో భాగంగా పోలీసులు సుమారు 77.750 గ్రాముల బంగారం, రూ. 8.10 లక్షల నగదు, ఒక ఆటో, ఒక ద్విచక్ర వాహనం, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ శనివారం మీడియాకు ఈ వివరాలను వెల్లడించారు. అరెస్టైన నిందితుల్లో ముగ్గురు చైన్ స్నాచర్లు కాగా, మరొకరు కారులో డబ్బు బ్యాగు దొంగిలించిన వ్యక్తి.
హనుమకొండ చైన్ స్నాచింగ్ – ప్రధాన నిందితుడు రాజేష్
హనుమకొండ కోటకు చెందిన చాపర్తి రాజేష్, ఇస్త్రీ షాపు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. కానీ, తన అవసరాలకు సరిపడని ఆదాయంతో అక్రమ మార్గాన్ని ఎంచుకుని చైన్ స్నాచింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు.
ఈనెల 11వ తేదీన హనుమకొండ రెడ్డి కాలనీలో ఒంటరిగా వెళ్తున్న ఓ మహిళ మెడలో ఉన్న 2.5 తులాల బంగారు గొలుసును ద్విచక్ర వాహనంపై నుంచి లాక్కొని పారిపోయాడు.
పోలీసులు కేసు నమోదు చేసుకుని సీసీ కెమెరాల ద్వారా దర్యాప్తు చేపట్టి పెద్దమ్మగడ్డ ప్రాంతంలో రాజేష్ను అరెస్టు చేశారు. విచారణలో అతడు గతంలో కేయూసీ, మట్టెవాడ, ఇంతేజార్ గంజ్ ప్రాంతాల్లో నాలుగు చోరీలకు పాల్పడ్డట్లు వెల్లడైంది.
కాజీపేట చైన్ స్నాచింగ్ – నిందితులు సంపత్ కుమార్, చుక్క మురళి
తాళ్లపల్లి సంపత్ కుమార్, హనుమకొండలో ఆటో డ్రైవర్గా పనిచేస్తూ, బెట్టింగ్ యాప్లలో డబ్బు పోగొట్టుకున్నాడు. ఆటో రుణం కట్టలేకపోవడంతో తన స్నేహితుడు చుక్క మురళితో కలిసి చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డాడు.
ఈ ఇద్దరూ శుక్రవారం కాజీపేటలో ఓ కిరాణ షాపుకు వెళ్లి, బిస్కెట్ ప్యాకెట్ కొనుగోలు చేస్తున్నట్లు నటించారు. అదే సమయంలో షాపు యజమానురాలి మెడలోని రోల్డ్ గోల్డ్ గొలుసును లాక్కొని ఆటోలో పారిపోయారు.
పోలీసులు కేసు నమోదు చేసుకుని శనివారం ఉదయం ఫాతిమా సెంటర్లో నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి 2.750 గ్రాముల బంగారం, ఒక ఆటో, ఒక సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు.
కేయూసీ పోలీస్ స్టేషన్ పరిధిలో డబ్బు చోరీ – నిందితుడు కార్తీక్
కర్నాటక రాష్ట్రానికి చెందిన కార్తీక్, హైదరాబాద్లో హోటల్ వ్యాపారి స్వాతి కిరణ్ వద్ద కారు డ్రైవర్గా పనిచేస్తూ జల్సాలకు అలవాటుపడ్డాడు.
ఈనెల 18వ తేదీన కారులో తన యజమాని డబ్బు బ్యాగును దొంగిలించాలని పథకం వేశాడు. వ్యాపార లావాదేవీల కోసం యజమాని రూ. 8 లక్షల నగదు తీసుకువచ్చాడు. రాత్రి భీమారంలో హోటల్ గదిలో విశ్రాంతి తీసుకుంటుండగా, కార్తీక్ బ్యాగును తీసుకుని పారిపోయాడు.
పోలీసులు టెక్నాలజీ సాయంతో వనస్థలిపురంలో కార్తీక్ను అరెస్టు చేసి, అతని వద్ద నుంచి 8 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల అభినందన
ఈ మూడు కేసులలో నిందితులను పట్టుకుని పోలీసులు అప్రమత్తతతో వ్యవహరించారని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ పేర్కొన్నారు. ఈ కేసుల దర్యాప్తులో క్రైమ్ డీసీపీ జనార్ధన్, సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా, ఏసీపీలు మధుసూదన్, దేవేందర్ రెడ్డి, నందిరాం నాయక్, తిరుమల్, ఇన్స్పెక్టర్లు బాలాజీ, సతీష్, రవికుమార్, సుధాకర్ రెడ్డి, టాస్క్ఫోర్స్, సీసీఎస్, హనుమకొండ, మట్వాడా, కాజీపేట పోలీస్ స్టేషన్ల సిబ్బంది కీలకంగా వ్యవహరించారని ఆయన అభినందించారు.
రిపోర్టర్. ప్రతీప్ రడపాక