- ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి కఠిన నిబంధనలు
- సైబర్ నేరాలను అరికట్టేందుకు ప్రత్యేక బృందం ఏర్పాటు
- మత్తు పదార్థాల వినియోగం, విక్రయాలపై కఠిన చర్యలు
- మహిళల భద్రత కోసం ప్రత్యేక పర్యవేక్షణ
- పోలీస్ శాఖను మరింత బలోపేతం చేయడం
తెలంగాణ ధ్వని : రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ కొత్త పోలీస్ కమిషనర్గా సన్ప్రీత్ సింగ్ నియమితులయ్యారు. సోమవారం ఆయన అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనరేట్ కార్యాలయానికి చేరుకున్న నూతన పోలీస్ కమిషనర్కు డీసీపీలు, అదనపు డీసీపీలు, ఇతర ఉన్నతాధికారులు పుష్పగుచ్ఛాలు అందజేసి ఘన స్వాగతం పలికారు.అనంతరం సాయుధ పోలీసు గౌరవ వందనం స్వీకరించిన సన్ప్రీత్ సింగ్, తన పదవి బాధ్యతలను పూర్వ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా నుంచి అధికారికంగా స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అంబర్ కిషోర్ ఝా కొత్త పోలీస్ కమిషనర్కు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు
పదవి బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సన్ప్రీత్ సింగ్ మాట్లాడుతూ, వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేర నియంత్రణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, సైబర్ నేరాల కట్టడికి కృషి చేస్తామన్నారు. ప్రజలకు పోలీసులపై మరింత నమ్మకం కలిగించేలా, పోలీసింగ్ను మరింత సమర్థవంతంగా అమలు చేస్తామన్నారు., ప్రస్తుత రోజుల్లో సైబర్ నేరాలు, మత్తు పదార్థాల వినియోగం వంటి సమస్యలు తీవ్రమవుతున్నాయి అని, వీటిని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. మత్తు పదార్థాలను విక్రయించే వారు, వినియోగించే వారిపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు.మహిళల భద్రత విషయంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘షీ టీమ్స్’, ‘భద్రత’ వంటి ప్రత్యేక విభాగాలను మరింత మెరుగుపరిచేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మహిళలపై హింస, వేధింపులను అరికట్టేందుకు ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డీసీపీలు షేక్ సలీమా, రాజమహేంద్ర నాయక్, అంకిత్ కుమార్, ఏఎస్పీ చైతన్య, అదనపు డీసీపీలు రవి, సురేష్ కుమార్తో పాటు వరంగల్ పోలీస్ కమిషనరేట్కు చెందిన ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
సన్ప్రీత్ సింగ్ తన ప్రసంగంలో, ప్రజల సహకారం లేకుండా శాంతిభద్రతలను కాపాడలేమని, అందువల్ల ప్రతి ఒక్కరూ పోలీసుల సహాయ సహకారాలు తీసుకుని, నేర నివారణలో భాగస్వామ్యులు కావాలని కోరారు. ప్రజలు ఏదైనా నేర సంఘటనను గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, తమ ఫిర్యాదులను నిర్భయంగా తెలియజేయాలన్నారు.
రిపోర్టర్. ప్రతీప్ రడపాక .