telanganadwani.com

RoadAccident

వరంగల్, సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదాలు – మృత్యువుకు బలి అయిన కుటుంబాలు!

  • హనుమకొండ-కరీంనగర్ హైవేపై తీవ్ర రోడ్డు ప్రమాదం.
  • సూర్యాపేటలో మరో ఘోర ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి.

తెలంగాణ ధ్వని : హనుమకొండ-కరీంనగర్ హైవే (నేషనల్ హైవే-563)పై మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హసన్‌పర్తి పెద్ద చెరువు మూల క్రాసింగ్ వద్ద టిప్పర్ లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో దుర్గం పవన్, పౌతు మహేష్ అనే ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. హసన్‌పర్తి నుంచి సీతంపేటకు వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాద స్థలంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఇటీవల వరంగల్-కరీంనగర్ హైవేలో వరుస ప్రమాదాలు జరుగుతుండగా, గతంలో అధికారులు ప్రమాదకరమైన తొమ్మిది మూలమలుపులను గుర్తించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. కానీ, అవి తొలగిపోయిన తర్వాత తిరిగి ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ఈ మార్గంలో వాహనదారులు వేగాన్ని కంట్రోల్ చేయకుండా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం ప్రమాదాలను మరింత పెంచుతోంది.

మరోవైపు, సూర్యాపేట జిల్లా చివ్వెంల బీబీగూడెం వద్ద జరిగిన మరో ఘోర రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచింది. ఆర్టీసీ బస్సు ఓ కారును ఢీకొట్టిన ఘటనలో గడ్డం రవీందర్, రేణుక, 8 ఏళ్ల చిన్నారి రితిక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరో ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా, వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. మృతుల స్వగ్రామం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కంఠాయపాలెం అని పోలీసులు తెలిపారు.

రెండు ఘటనలతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. హైవేలపై వరుసగా జరుగుతున్న ప్రమాదాలను అరికట్టేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా ప్రమాదకరమైన మార్గాల్లో హెచ్చరిక బోర్డులు తిరిగి ఏర్పాటు చేయడంతో పాటు, ట్రాఫిక్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని సూచిస్తున్నారు. వేగనియంత్రణ, సీసీటీవీ పర్యవేక్షణ, ట్రాఫిక్ నియంత్రణపై మరింత దృష్టి పెట్టాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు త్వరితగతిన చర్యలు తీసుకుంటేనే రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గొచ్చని ప్రజలు ఆశిస్తున్నారు.

రిపోర్టర్. ప్రతీప్ రడపాక 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top