ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం – నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో గృహ నిర్మాణాలు.
తెలంగాణ ధ్వని : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఆరెం రేవంత్ రెడ్డి ఈనెల 16న స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా నియోజకవర్గానికి చెందిన అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పర్యటన ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించి, అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని సూచించారు.
ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేపడుతోంది. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఇతర అధికారులతో కలిసి మంగళవారం సమావేశం నిర్వహించారు. సీఎం పర్యటనకు కేవలం నాలుగు రోజులు మాత్రమే ఉన్నందున, ఏర్పాట్లను వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
16వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు సీఎం ఘన్పూర్ సభా స్థలికి చేరుకుని, 12:30 గంటల నుంచి ఒంటి గంట వరకు వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం 2:30 గంటల వరకు బహిరంగ సభలో పాల్గొంటారు. సభకు సంబంధించిన మౌలిక వసతులు, హెలిప్యాడ్, వీవీఐపీ పార్కింగ్, మండలాల నుంచి వచ్చే వాహనాల పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
సీఎం రేవంత్ రెడ్డి స్టేషన్ ఘన్పూర్ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారని, నియోజకవర్గ అభివృద్ధికి రూ.800 కోట్లు మంజూరు చేసినట్టు ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. సీఎం పర్యటన సందర్భంగా మొత్తం 24 అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు.
రిపోర్టర్. ప్రతీప్ రడపాక..