తెలంగాణ ధ్వని : నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) వరంగల్ లోని శిక్షణ మరియు అభ్యాస కేంద్రం (సెంటర్ ఫర్ ట్రైనింగ్ అండ్ లెర్నింగ్ – CTL)
ఆధ్వర్యంలో “ఏఐఓటీ (కృత్రిమ మేధస్సు మరియు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) మరియు దాని అనువర్తనాలు” అనే అంశంపై నెలరోజుల పాటు జరిగే జాతీయ స్థాయి ఇంటర్న్షిప్ మరియు సమగ్ర శిక్షణా కార్యక్రమం 2025 మే 15 నుండి జూన్ 15 వరకు నిర్వహించబడుతోంది.
ఈ కార్యక్రమాన్ని నిట్ వరంగల్ డీన్ (ప్రణాళిక మరియు అభివృద్ధి) ప్రొఫెసర్ పి. రతీష్ కుమార్ గారు ప్రారంభించారు. ప్రారంభ కార్యక్రమానికి రీసర్చ్ సెంటర్ ఇమారత్ (RCI), DRDO, హైదరాబాద్ శాస్త్రవేత్తలు డా. జి. మల్లికార్జున రావు (సైన్టిస్ట్ G & టెక్నాలజీ డైరెక్టర్) మరియు డా. కనికే శ్రీనివాసులు (సైన్టిస్ట్ G & ప్రాజెక్ట్ డైరెక్టర్) ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
కార్యక్రమ నిర్వాహకులు మరియు CTL అధిపతి ప్రొఫెసర్ టి. కిషోర్ కుమార్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రొఫెసర్ రతీష్ కుమార్ మాట్లాడుతూ, “ఈ ఇంటర్న్షిప్ కార్యక్రమం విద్యార్థులకు సాంకేతిక విజ్ఞానంతో పాటు ప్రాక్టికల్ స్కిల్స్ను అందించడానికి రూపుదిద్దుకుంది.
ఇటువంటి శిక్షణలతోనే భవిష్యత్తు పౌరులను ఆవిష్కర్తలుగా తీర్చిదిద్దవచ్చు” అని పేర్కొన్నారు.ప్రొఫెసర్ టి. కిషోర్ కుమార్ మాట్లాడుతూ,
“ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ప్రముఖ విద్యాసంస్థల నుండి కేవలం ఐదు రోజుల్లోనే 120 పైగా విద్యార్థులు నమోదు చేసుకోవడం ఎంతో ఉత్సాహదాయకం” అని తెలిపారు.
నిపుణులైన బోధన సిబ్బంది ద్వారా లెక్చర్లతో పాటు ప్రాక్టికల్ సెషన్లు కూడా నిర్వహించబడతాయని చెప్పారు.ముఖ్య అతిథిగా డా. జి. మల్లికార్జున రావు గారు “రక్షణ రంగంలో కృత్రిమ మేధస్సు యొక్క పాత్ర” పై కీలక ప్రసంగం చేశారు.
ఆయన మాట్లాడుతూ, “ఏఐ ఆధారిత సాంకేతికతలు రక్షణ వ్యవస్థల్లో గణనీయమైన మార్పులు తీసుకువస్తున్నాయి. ఇవి నిర్ణయ ప్రక్రియను మెరుగుపరచడంలో, పని సామర్థ్యాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.
దేశ భద్రత కోసం ఏఐ వినియోగం తప్పనిసరిగా మారింది” అని అన్నారు.అలాగే డా. కనికే శ్రీనివాసులు గారు విద్యార్థులను ఏఐఓటీ లోని విస్తృత అవకాశాలను అర్థం చేసుకుని, రక్షణ, వ్యవసాయం, స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి రంగాలలో తమ పాత్రను నిర్వర్తించేందుకు ప్రేరేపించారు.
రిపోర్టర్.ప్రతీప్ రడపాక